సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

Mar 28,2024 22:38

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య
ప్రజాశక్తి – మంగళగిరి :
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నితిరుపతయ్య కోరారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మతోన్మాద బిజెపి విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఇండియా వేదిక ఏర్పడిందని అన్నారు. ఈ వేదిక నుండి పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పదేళ్ల బిజెపి పాలనలో భారత రాజ్యాంగం ధ్వంసం చేసే విధంగా పరిపాలన సాగిందని విమర్శించారు. బిజెపి మళ్లీ గెలిస్తే దేశం అదోగతి పాలవుతుందని హెచ్చరించారు. సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రానికి బిజెపి తీవ్ర అన్యాయం చేసినా రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు మూడు బీజేపీ జపం చేస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వలేదని, విభజన హామీలను అమలపరచలేదని గుర్తు చేశారు. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు పట్టించుకోవడంలేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే అసెంబ్లీకి, పార్లమెంట్లకు కార్మికవర్గ, రైతాంగ ప్రతినిధులు ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజా పోరాటాలను బయట నిర్వహిస్తూనే ప్రజా గళాన్ని చట్ట సభల్లో వినిపించే ప్రతినిధులను కూడా ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండియా వేదిక అభ్యర్థి ఉంటాడని, అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు జె.జాన్‌బాబు, సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్న శివశంకరరావు, పి.బాలకృష్ణ, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, నాయకులు బాలాజీ, గణేష్‌ పాల్గొన్నారు.

➡️