ప్రజాశక్తి-విజయనగరం : ఎపి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 31న సీతమ్ ఇంజనీరింగ్ కళాశాలలో రీజినల్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి అరుణ, రీజనల్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి రోహిణి తెలిపారు. ఈమేరకు జాబ్మేళా కరపత్రాన్ని సోమవారం కలెక్టర్ నాగలక్ష్మి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. 87బహుళజాతి కంపెనీలతో నిర్వహించే ఈ జాబ్మేళాలో ఐటి సెక్టార్, ఫార్మా, మ్యాన్ఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, బ్యాంకింగ, హాస్పిటాలిటీ, రిటైల్, మార్కెటింగ్, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో సుమారుగా 5892 ఖాళీల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆరు జిల్లాలో ఉన్న యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జాబ్ మేళాకు పదో తరగతి నుండి పీజీ వరుకు చదువుకున్న నిరుద్యోగులు హాజరు కావాలని తెలిపారు. అభ్యర్థుల స్కిల్ బట్టి రూ.15వేల నుంచి రూ. 60వేలు వరుకు వేతనాలు ఉంటాయని, బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి గోవిందరావు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి షణ్ముఖ రెడ్డి, సురేష్ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/job.jpg)