ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్
మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారానికి 6వ రోజుకు చేరింది. అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికులు అర్థనగ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రధాన కార్యదర్శి పూజారి వాసు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందర బాబు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న కార్మికుల డిమాండ్స్ పరిష్కారం చేయకుండా ప్రభుత్వం పోటీ కార్మికులను పెట్టమని ఆదేశాలు జారీ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల పట్ల చిత్త శుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వం ఏదో ఒక రోజు బటన్ నొక్కి పర్మినెంట్ చేస్తుందని, లేదా సమాన పనికి సమాన వేతనం ఇస్తాదనే ఆశతో కార్మికులు ఎదురుచూస్తున్నారని అన్నారు. కమిటీ అధ్యక్షుడు భూపతి రవీంద్ర మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించని కారణంగానే కార్మికులు సమ్మెలు చేయాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కళ్యాణ్, రాజేష్, మీసాల ప్రేమ్, మీసాల జ్యోతి, కారంకి ప్రసాద్, ముత్యాల శ్రీను, వడ్డాది శ్యామ్, ఎం.శకుంతల, రాజన్న, అప్పారావు, మాండ్రు సుధీర్, మీసాల కిషోర్ తదితరులు నాయకత్వం వహించారు.