Feb 11,2024 21:16

సొంతింటి కల.. నెరవేరేదెలా?ప్రజాశక్తి-రేగిడిమండలంలోని 25 సచివాలయాల పరిధిలో 15 గ్రామాలకు సంబంధించి జగనన్న కాలనీలు మూడేళ్లు గడిచినా పూర్తికాలేదు. మండలంలో 368 లేఅవుట్లకు సంబంధించి 2,531 జగనన్న ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి పట్టాలు అందజేశారు. ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇచ్చినా కొన్ని గ్రామాల్లో పూర్తిగా నిర్మాణాలు చేపట్టలేదు. మరికొన్ని గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభించినా, అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. ఇంకొన్ని గ్రామాల్లో లేఅవుట్‌ ఇచ్చినా కోర్టు పెండింగ్‌తో కనీసం ఒక్క ఇల్లు కూడా నిర్మాణాలు చేపట్టలేని దౌర్భాగ్య స్థితిలో లబ్ధిదారులు ఉన్నారు. గత ప్రభుత్వాలు డి పట్టా భూములు ఇచ్చినా వాటిని రెవెన్యూ అధికారులు తిరిగి తీసుకొని లేఅవుట్లు వేశారు. డి-పట్టాదారులు కోర్టును ఆశ్రయించి స్టే తీసుకురావడంతో ఆ గ్రామాల్లో జగనన్న కాలనీలు పూర్తిగా నిలిచిపోయాయి. జగనన్న కాలనీ ఊరినే తలపిస్తుందన్న ప్రభుత్వ ఊకదంపుడు ప్రసంగాలు, ప్రకటనలే తప్ప ఆచరణలో శూన్యమని స్పష్టంగా కనిపిస్తుంది.రేగిడి మండలంలోని గుల్లపాడు పంచాయతీ పరిధిలోని కొండలమామిడి వలసలో సర్వే నంబరు 1లో కొండపోరంబోకులో రేగిడి, ఆముదాలవలస, మజ్జిరాముడుపేట, అంబకండి, సంకిలితోపాటు మరో మూడు పంచాయతీలకు జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరు చేశారు. 220 జగనన్న ఇళ్లకు 55 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 165 వివిధ స్థాయిల్లో నిర్మాణాల్లోనే ఉన్నాయి. కాగితాపల్లి పంచాయతీలో 24 గృహాలు మంజూరయ్యారు. గ్రామానికి దూరం కావడంతో లబ్ధిదారులు పూర్తిగా నిర్మాణాలు చేపట్టలేదు. సంకిలి గ్రామంలో సర్వే నంబరు 319లో 75 గృహాలు, 97లో సర్వే 38 గృహాలు మంజూరైనా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. ఇక్కడ గతంలో ఎస్‌సి లబ్ధిదారునికి డి పట్టా ఇచ్చినప్పటికీ జీడి, మామిడి తోట తిరిగి తీసుకుని, జగనన్న కాలనీకి ఇవ్వడంతో వన్నలి జనార్దన కోర్టును ఆచరించడంతో స్టే విధించారు. సర్వే నంబరు 97లో నారు జనార్దన, పట్టాభిలకు చెందిన 25 ఏళ్లుగా హక్కుల ఉన్న స్థలంలో జగనన్న కాలనీకి కేటాయించారు. వీరు కోర్టును ఆశ్రయించడంతో స్టే విధించారు. ఖండ్యాంలో 18, వెంకటాపురం 20 గృహాలు కట్టలేదు. మునగలవలసలో తొమ్మిదింటికి నాలుగు నిర్మాణాలు చేపట్టలేదు. వెంకంపేటలో 11 గృహాలకు ఒకటి మాత్రమే పూర్తిచేశారు. తోకలవలసలో 7, సరసనాపల్లెలో ఆరు, సోమరాజుపేట ఆరు గృహాలు మంజూరైనా పూర్తిగా నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 160 జగనన్న కాలనీల్లో గృహాలు పూర్తిగా ప్రారంభించలేదు. మరోవైపు ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న రూ.1.80 లక్షలు ఇసుక, సిమెంటుకే చాలడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అది కూడా కొండ ప్రాంతంలో జగనన్న కాలనీకి స్థలం మంజూరు చేయడంతో సమాన ప్రాతిపదికన పునాదులకే ఐదు లక్షల రూపాయలు అవుతుందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రభుత్వమే జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మిస్తుందని చెప్పి, వెనుకడుగు వేయడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తయిన జగనన్న కాలనీలకు రహదారులు, తాగునీరు, విద్యుత్‌ సమస్య ఉందని చెబుతున్నారు.జాప్యం వాస్తవం జగనన్న కాలనీల ఏర్పాటులో జాప్యం వాస్తవం.. కాలనీల నిర్మాణాల వేగవంతానికి చర్యలు తీసుకుంటాం. కొన్ని చోట్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించినా ముందుకు రావడం లేదు. ఇళ్ల నిర్మాణంలో జిల్లాలో రేగిడి మండలం ముందంజలో ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్మాణాలు వేగవంతం చేసేందుకు కృషి చేస్తాం.- జగన్నాథరావు, హౌసింగ్‌ ఎఇ

➡️