ప్రజాశక్తి- గజపతినగరం : పట్టణంలోని ప్రముఖ వ్యాపారి ఆరిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు (68) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానిక జాతీయ రహదారి సమీపంలోని బైరిపురం జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది .ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కాశీ అదుపుతప్పి వెనుక నుంచి వస్తున్న లారీ వెనుక చక్రాల కింద పడిపోవడంతో తల నుజ్జునుజ్జయింది. దీంతో కాశీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గజపతినగరంలో వ్యాపారపరంగా పేరున్న కుటుంబానికి చెందిన కాశీ దుర్మరణం స్థానిక వ్యాపారులను తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్ఐ యు.మహేష్ ప్రమాద తీరును పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.