ప్రజాశక్తి -అనంతగిరి: రోడ్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జడ్పిటిసి దీసరి గంగరాజు డిమాండ్ చేశారు. అనంతగిరి పంచాయతీ మాలింగవలస, పాతకొట, రేగం, నందిగుమి, తేనెపుటు, తెల్లరపాడు గ్రామాల్లో ఆదివారం సీపీఎం బృందం పర్యటించింది. అనంతరం గ్రామస్తులతో రేగంలో సమవేశమై పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ రోడ్డు పనులు ఏళ్ల తరబడి నిలిచి పోయాయని తెలిపారు. అనంతరం గంగరాజు గిరిజనులతో మాట్లాడుతూ, ప్రభుత్వం మిషన్ కనెక్ట్ పాడేరులో భాగంగా పివిటీజి గ్రామాలకు రోడ్డు నిర్మాణం కోసం ఉపాధి హామీ పథకం ద్వారా 2 కోట్లా 16 లక్షల నిధులు మంజూరు కాగా ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులు తప్పుడు బిల్లులు చెల్లించి నిధులు స్వాహా చేశారని విమర్శించారు. రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిపి వేశారని, దీంతో వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొందన్నారు. రోడ్డు నిర్మాణాలకు కోట్లు ఖర్చు పెట్టినా అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. పివిటిజి గ్రామాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించినా రోడ్డు నిర్మాణాలు చేపట్టలేదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతోనే రోడ్డు పనులు ముందుకు సాగలేదన్నారు. బిల్లులు యధావిధిగా అప్లోడ్ చేస్తూ నిదులు దారి మళ్లించారని విమర్శించారు. తన పర్యటనలో వెలుగు చూసిన సమస్యలను జిల్లా పరిషత్ చైర్మన్ సుభధ్ర , జిల్లా కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిలకు తెలియజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోమ్మెల నాగులు, వైస్ సర్పంచ్ పాంగి అర్జున్ గిరిజన సంఘం నాయకుడు నరాజీ సురేష్ బాబు, సోమెల రాంబాబు, ధర్మన్న, డి.దేముడు, పి.పండన్న పాల్గొన్నారు.