ప్రజాశక్తి-పాడేరు: రానున్న సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట్ , ఐటీడీఏ పీవో వి అభిషేక్, అదనపు ఎస్పి కె.ధీరజ్లతో కలిసి గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం, అరక అసెంబ్లీ నియోజకవర్గం, అరకు పార్లమెంట్ నియోజక వర్గాలకు విడివిడిగా స్ట్రాంగ్ రూములను ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు లేకుండా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ సిబ్బంది రవాణా వాహనాలకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముందుగా ఈవీఎంల భద్రపరిచిన వేర్ హౌస్ ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎస్.డి సి. పి.అంబేద్కర్, తహసిల్దార్ అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.