ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మహిళల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి డిమాండ్ చేశారు. ముంచింగి పుట్టులో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని మండల అధ్యక్షులు ఎస్.ఈశ్వరి, మండల కార్యదర్శి ఎస్.విజయల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలకు ప్రత్యేక చట్టాలు, హక్కులు కల్పించాలన్నారు. మహిళల స్వేచ్ఛను కాపాడాలన్నారు. మహిళల రిజర్వేషన్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు.ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మానవుల హక్కుల ఉల్లంఘం దినాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మహిళల హక్కుల, చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. నేటి మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ నైపుణ్యత కలిగి ఉన్నారని గుర్తు చేశారు. స్వతంత్ర సమరయోధులతో పాటుగా ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి పూలే, కరణం మల్లేశ్వరి వంటి శక్తివంతమైన మహిళలు ఉన్నారని కొనియాడారు.అనంతరం గిరిజన మహిళ సంఘం మండల అధ్యక్షురాలు విజయ మాట్లాడుతూ, మండల పరిధిలో నాటు సారా క్రయవిక్రయాలు జరుగుతున్నామని తెలిపారు.పోలీస్ శాఖ ఈ విషయంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మిపురం సర్పంచ్ కొర్ర త్రినాథ్, సిపిఎం నాయకులు లైకోన్, మహిళా సంఘం కమిటీ నెంబర్స్ వసుధ, మీనా, రాధమ్మ పాల్గొన్నారు.