ప్రజాశక్తి-పాడేరు:స్పందనలో స్వీకరించిన సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ భావనా వశిస్ట్, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్, సబ్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, డి.ఆర్.ఓ పద్మావతితో కలిసి వివిద మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 75 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇఇ. డి.వి.ఆర్. ఎం.రాజు, పంచాయతీ రాజ్ ఇఇ కొండయ్య పడాల్, ఐసిడిఎస్ పిడి సూర్యలక్ష్మి, ఎస్డిసి, వివిఎస్ శర్మ, పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకలు నరసింహులు, ఐటిడిఏ పరిపాలనాధికారి హేమలత, డివిజనల్ పంచాయతీ అధికారి పి.ఎస్.కుమార్ పాల్గొన్నారు.పలు వినతులు పాడేరు మండలం మినుములూరు సర్పంచ్ లంకెల చిట్టెమ్మ మినులూరు పంచాయతీ పరిధిలోని ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు, స్థంబాలకు మరమ్మతులు చేపట్టాలని, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని పలువురు వినతి పత్రం సమర్పించారు.హకుంపేట మండలం కొట్నాపల్లిలో నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీ వలన గ్రామస్తులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని క్వారీని నిలుపుదల చేయాలని కె.చిట్టిబాబు వినతి పత్రంలో పేర్కొన్నారు. హుకుంపేట మండలంలో పలు పోలింగ్ కేంద్రాలకు ర్యాంపులు నిర్మించానని సంబంధిత బిల్లులు మంజూరు చేయాలని జె. వరహాలు వినతిపత్రాన్ని అందజేసారు. హుకుంపేట మండలం మజ్జివలస నుండి కొండయ్యపాడు గ్రామం వరకు ఏడు కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలని బూర్జ ఎంపిటిసి మజ్జి హరి వినతి పత్రం సమర్పించారు. చింతపల్లి మండలం అంజలి శనివారం మాడెంబంధ గ్రామం నుండి పాల మామిడి గ్రామం వరకు మూడు కిలో మీటర్ల రోడ్డు నిర్మించాలని సి.హెచ్.రామారావు వినతి పత్రం అందజేసారు. పాడేరు మండలం వంట్ల మామిడి పంచాయతీ నందిగరువు గ్రామస్తులు నందిగరువు నుండి 12వ మైలు రాయి వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. ఎఎన్ఎంఫై సరెండర్ను ఎత్తి వేయాలి పాడేరు:పెదబయలు మండలం గోమాంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బొండపల్లి సచివాలయంలో పని చేస్తున్న గ్రేడ్-3 ఏఎన్ఎం డి.చంద్రమ్మకు గోమాంగి వైద్యాధికారి నిబంధనలకు విరుద్దంగా జారి చేసిన సరెండర్’ను ఉపసంహరించుకోవాలని పాడేరులో సిఐటియు జిల్లా నాయకులు ఎల్. సుందర్రరావు ఆధ్వర్యాన పోయిపల్లి పంచాయతీ ప్రజలు స్పందనలో పిఓకు వినతిపత్రం అందజేశారు. ఏఎన్ఎం పంచాయతీ పరిధిలో సక్రమంగానే విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. స్థానిక విలేకరులతో గ్రామస్తులు వార్డు మెంబర్ పాంగి. కృష్ణ, పోయిభ రాజారావు, తిరుపతిరావులు మాట్లాడుతూ, ఏఎన్ఎం గ్రామాలకు రాకపొతే తామే అధికారులకు పిర్యాదు చేస్తామన్నారు. ఏడాది పొడవునా ఆమె రాలేదంటే మాత్రం తాము ఒప్పుకోమన్నారు. ఉన్నత స్థాయి అధికారులకు వైద్యాధికారి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు.