ప్రజాశక్తి-అనంతగిరి:ఏళ్ళు గడుస్తున్నా గిరిజన పల్లెలు అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గుతున్నాయి. కనీసం సరైన రోడ్డు మార్గాలు లేక మారుమూల గిరిజన పల్లెల గిరి పుత్రులు ఎత్తైన కొండల మధ్య కిలోమీటర్ల దూరం కాలిబాటన సరుకులు నెత్తిపై మోసి గ్రామాలకు తీసుకొస్తున్నారు. లొంపలి పంచాయతీ చిన్నకోనెల, బూరిగ గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేక పోవడంతో ఆయా గ్రామాల గిరిజన ప్రజలు విజయనగరం జిల్లా లోతుగెడ్డ పంచాయతీ సారడవలస గ్రామంలో రేషన్ బియ్యం విడిపించుకుని తిరిగి సుమారు 8 కిలోమీటర్లు కొండ కోన నడుము నుండి తమ గ్రామాలకు కాలినడకాన మోసికొని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.ఎన్ఆర్.పురం పంచాయతీ పెద్దూరు, బొడ్డవలస మీదుగా బూరిగ, చిన్నకోనెల గ్రామాలకు మిషన్ కనెక్టివిటీ పాడేరు కింద నిధులు నాలుగు కోట్లు మంజూరు చేశారు. తూతూ మాత్రంగా రోడ్డు పనులు చేపట్టి వదిలేసారని, దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని పదవ వార్డ్ మెంబర్ సోమ్మెల అప్పలరాజు, గ్రామస్తులు బి.సన్యాసిరావు, కె సింహాచలం ఆవేదన వ్యక్తం చేశారు.