ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్:సాగులో ఉన్న గిరిజన రైతులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద నాతవరం, గొలుగొండ మండలాలకు చెందిన గిరిజన రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు మాట్లాడుతూ, గొలుగొండ, నాతవరం మండలాల్లో అనేక ఏళ్లుగా గిరిజన రైతులు అటవీ పోడు వ్యవసాయం చేస్తు న్నారన్నారు. పారెస్టు, రెవిన్యూ అదికారులు సర్వేలు జరిపి పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. గొలుగొండ మండలం బుడ్డడపాడు, సుద్దలపాలెం, అడ్డరలోవ గ్రామ గిరిజన రైతులు అనేక తరాలుగా ప్రభుత్వ భూములను సాగు చేసుకొని జీవిస్తున్నారని, వీరు సాగు చేస్తున్న భూములకు సర్వే జరిపి గిరిజన రైతుల పేరున పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదరు భూములు గిరిజనేతరుల పేరున ఉన్న ఆ రికార్డులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం, అధికారులు, నాయకులు స్పందించి ఆర్ఒఎఫ్ఆర్ పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి, ఈరెల్లి చిరంజీవి, కన్నబాబు, ఎం.నాగమణి, శివ, రాము పాల్గొన్నారు.
![ధర్నా చేపడుతున్న సిపిఎం నేతలు, గిరిజనులు](https://prajasakti.com/wp-content/uploads/2024/01/c-p-m-1.jpg)