చెత్త వాహనాలను పరిశీలిస్తున్న మేయర్ వసీం, తదితరులు
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్
చాలారోజుల తర్వాత నగరంలో ఇంటింటి చెత్త సేకరణను పున:ప్రారంభించినట్లు మేయర్ మహమ్మద్ వసీం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లాప్ ఆటోలు ద్వారా సక్రమంగా ఇంటింటా చెత్త సేకరణ జరిగే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురానికి 47 క్లాప్ ఆటోలు వచ్చాయన్నారు. ఈనేపథ్యంలో కొద్దిరోజుల నుంచి చెత్త సేకరణ ఆగిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నుంచి సేకరణ జరగలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో మళ్లీ క్లాప్ ఆటోల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ముఖ్యంగా తడి, పొడి, హానికర చెత్తను ప్రత్యేకంగా విభజించి చెత్త బుట్టల్లో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ విజయభాస్కర్రెడ్డి, సెక్రటరీ సంఘం శ్రీనివాసులు, డిఇ రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.