అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ గౌతమి
అనంతపురం కలెక్టరేట్ : వివిధ సమస్యలపై ప్రజలు అందించే అర్జీలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవితో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్ అర్జీలను ఎలాంటి ఆలస్యం కాకుండా సకాలంలో వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు.ఆయా శాఖల అధికారులు దీనిపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గ్రంధి వెంకటేష్, సమగ్ర శిక్ష ఎపిసి వరప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, డిఎల్డిఒ ఓబులమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.