సాయుధ దళాల పతాక స్టిక్కర్లు, కార్ గ్లాగ్స్ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్
అనంతపురం కలెక్టరేట్ : దేశ రక్షణకు నిరంతర సేవలు అందిస్తూ యుద్ధంలో మరణించిన, ఉద్యోగ విరమణ చేసిన సాయుధ దళాల కుటుంబాల సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ ఎం.గౌతమి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో త్రిసాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా రూ.70 వేల విలువగల సాయుధ దళాల పతాక స్టిక్కర్లు, కార్ గ్లాగ్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశరక్షణలో త్రిసాయుధ దళాల సేవలు కీలకమన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 7వ తేదీన దేశవ్యాప్తంగా సాయుధ దళాల పతాక దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక నిధికి విరివిగా విరాళాలు అందించాలన్నారు. సాయుధ దళాల కుటుంబాలను ఆదుకునేందుకు అధికారులు సిబ్బంది విరాళాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి జె.శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ గిరీష్, జూనియర్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్, ఒఎస్ అనిల్ పాల్గొన్నారు.