అర్జీలను స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు
అనంతపురం కలెక్టరేట్ : ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ”ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం)లో ప్రజలు సమస్యలపై ఇచ్చే విజ్ఞప్తులకు త్వరితగతిన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్ తెలిపారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఒ జి.రామకృష్ణారెడ్డి, డిపిఎం ఆనంద్, ఎస్డిసి శిరీషతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులతోకలిసి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు 344 అర్జీలను అధికారులకు అందించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని, ఈ విషయమై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ అశోక్ కుమార్, డిఎంహెచ్ఒ డా||ఈబి.దేవితో పాటు జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.