ప్రజాశక్తి-చింతూరు
మేకలు, గొర్రెలకు వర్షం కాలం ప్రారంభంలో సీజనల్గా వచ్చే చిటుక వ్యాధి నివారణకు ముందస్తు చర్యలు భాగంగా ఈ నెల 15వ తేదీ నుండి టీకాలు వేస్తున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ కె.అన్వేష్ తెలిపారు. చింతూరు గ్రామపంచాయతీ పరిధి వేగితోట గ్రామంలో గురువారం మేకలు, గొర్రెలకు చిటుక వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ జీవాలకు చిటుక వ్యాధి నివారణ కోసం టీకాలు వేస్తున్నట్టు తెలిపారు. గేదెలకు వచ్చే గొంతు వాపుకు కూడా వ్యాక్సిన్ వేస్తున్నట్టు చెప్పారు. పశువులను పెంచే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏవో మంగారావు, ఎల్ఎస్ఏ రవి, విఏ జ్యోతి, మండలంలోని 12 మంది పశుసంవర్ధకశాఖ సహాయకులు పాల్గొన్నారు.