ఆర్డీవో కార్యాలయం ముట్టడి, ర్యాలీ..
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అంగన్వాడీలు చేపడుతున్న రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం ఎదుట ర్యాలీ నిర్వహించి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కార్యాలయాన్ని ముట్టడి చేశారు. మొదట ఆర్డీవో కార్యాలయం నుంచి ఫ్లై ఓవర్ మీదుగా ర్యాలీ చేపట్టి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పీ.సీ నరసింహులు, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు మహేష్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎంఎస్ రాయుడు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, కార్యదర్శి నరసింహ సర్వేపల్లి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పందికాళ్ళ మణి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పెంచలయ్య లు కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపి మాట్లాడుతూ మహిళలను రోడ్ల మీదకు లాగిన పాపం ప్రభుత్వాన్ని కట్టి కుడుపేస్తుందని, తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఎంతకాలమైనా పోరాటం కొనసాగిస్తామని, రానున్న ఎన్నికలలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి శివరామకృష్ణదేవరా, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి సికిందర్ తో పాటు రాజంపేట, రైల్వే కోడూరు, చిట్వేలి ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.