ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అంగన్వాడీలను వేధింపులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుందని టిడిపి నాయకులు మేడా బాబు అన్నారు. డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అంగన్వాడీల సమ్మె 5వ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కలలకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, ఏరియా కార్యదర్శి శివరామకృష్ణదేవరా, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్మెస్ రాయుడు నిరసనలు పాల్గొని సంఘీభావం తెలిపారు. టిడిపి నాయకులు మేడా బాబు అంగన్వాడీలతో నిరసన కార్యక్రమంలో పాల్గొని తన సంఘీభావాన్ని తెలిపి రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని దుయ్యబట్టారు. అంగన్వాడీలకు న్యాయం జరిగే వరకూ టిడిపి వారికి అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సరస్వతమ్మ, శివరంజని, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.