సీఐటీయూ
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ తెలియజేశారు. గురువారం సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం నుంచి మన్నూరులోని రూరల్ పోలీస్ స్టేషన్ వరకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ర్యాలీగా వెళ్లి కొత్త బస్టాండ్ వద్ద గల వై.యస్ రాజశేఖర్ రెడ్డి కూడలి వద్ద మానవహారంగా నిలబడి నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. ఒక నెల వేతనం పోయినా ఉద్యమం మాత్రం ఆపబోమని ఈ సందర్భంగా సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎంఎస్ రాయుడు, పట్టణ కార్యదర్శి సికిందర్, అంగన్వాడి కార్యకర్తలు రమాదేవి, సుజాత, ఈశ్వరమ్మ, శివరంజని, విజయ, అమరావతి తదితరులు పాల్గొన్నారు.