టిడిపి అభ్యర్ధుల విస్త్రృత ప్రచారం

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండల కేంద్రమైన భట్టిప్రోలు, వద్దేపల్లి గ్రామాల్లో టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్ధి నక్కా ఆనందబాబు, బాపట్ల ఎంపి అభ్యర్ధి తెన్నేటి కృష్ణ ప్రసాద్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు నాయకులకు ఘన స్వాగతం పలికారు. అద్దేపల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈసందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మైనారిటీ నాయకులతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టిడిపికి ఓట్లు వేస్తే బిజెపి ఖాతాలోకి చేరుతాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. వైసిపి ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టిడిపి, జనసేన ముస్లింలకు అండగా ఉంటాయని పేర్కొన్నారు. గతంలో బిజెపి ప్రభుత్వం పాలనలో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనలు టిడిపి చేపట్టిన ఘటనలు గుర్తు చేశారు. గత ఐదేళ్లుగా సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు. మద్యనిషేధం అని చెప్పి మద్యాన్ని వ్యాపారంగా చేసుకున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో దళిత, గిరిజనులు 8శాతం పైగా వైసీపీకి ఓట్లు వేసి గెలిపిస్తే గెలిచాక వారిని దగా చేశారని ఆరోపించారు. మరోసారి వైసీపీకి ఓట్లు వేసి గెలిపిస్తే రాష్ట్రం మరింత అంధకారంలోకి వెళుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని కోరారు. ఎంఎల్‌ఎగా తనను, ఎంపిగా కృష్ణప్రసాద్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శ తూనుగుంట్ల సాయిబాబా, టిడిపి మండల కన్వీనర్ వాకా శేషుబాబు, మాజీ అధ్యక్షులు వై కరుణ శ్రీనివాసరావు, ఎడ్ల జయశిలరావు, కనపర్తి సుందరరావు పాల్గొన్నారు.

➡️