సిఎం సభ సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపు

Mar 8,2024 23:26

ప్రజాశక్తి – బాపట్ల జిల్లా
కొరిశపాడు మండలంలో ఈనెల 10న ఆదివారం జరగనున్న సిద్ధం సభకు సిఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలు దారి మళ్లించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నెల్లూరు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్ళు భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుండి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డరోడ్డు మీదుగా హైదరాబాద్ కు మళ్ళించారు. హైదరాబాద్ నుండి ఒంగోలు వైపుకు వచ్చే భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా మళ్ళించారు. నెల్లూరు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్ళు సాధారణ వాహనాలను మేదరమెట్ల వద్ద నుండి నామ్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా అనుమతించారు. ఒంగోలు నుండి విశాఖపట్నం వైపు ఎన్‌హెచ్‌16పై వెళ్ళు వాహనాలను త్రోవగుంట నుండి ఎన్‌హెచ్‌216పైకి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపనున్నారు. ఒంగోలు నుండి విజయవాడ, గుంటూరు వైపు ఎన్‌హెచ్‌16పై వెళ్ళు వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా అనుమతించారు. ఒంగోలు నుండి చిలకలూరిపేట వైపు వెళ్ళు వాహనాలను త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా మళ్లించారు. విశాఖపట్నం నుండి ఒంగోలు, చెన్నై వైపు వెళ్ళు వాహనాలను నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లించారు. గుంటూరు నుండి ఒంగోలు, చెన్నై వైపు వెళ్ళు వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుండి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లించారు. చిలకలూరిపేట వైపు నుండి ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్ళు వాహనాలను పర్చూరు, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లించారు.
16వ నంబర్ జాతీయ రహదారిపై మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుండి బొల్లాపల్లి టోల్ ప్లాజా వరకు ఎటువంటి వాహనాలు అనుమతించబడవని తెలిపారు. కేవలం సిద్ధం సభ ప్రాంగణానికి వచ్చు వాహనాలను మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. అద్దంకి నుండి నాగులపాడు, వెంకటాపురం మీదుగా జాతీయ రహదారిపైకి ఉటువంటి వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. ఈ ఆంక్షలు మార్చి 10న ఆదివారం ఉదయం 10 గంటల నుండి అమలులోకి వస్తాయని తెలిపారు.

➡️