ఎండల తీవ్రతపై అప్రమత్తం

May 4,2024 21:35

ప్రజాశక్తి- సీతానగరం : ఎండతీవ్రతల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం బూర్జ గ్రామ పరిధిలో ఉపాధిహామీ వేతనదారులకు వేసవి దృష్ట్యా వడదెబ్బ, డీహైడ్రేషన్‌కు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించి అవగాహన కల్పించారు. బయట ఉష్ణోగ్రతలు కారణంగా శరీరం ఎక్కువ నీరు, లవణాలను కోల్పోతుందని, వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని, నీరు, నిమ్మరసం, మజ్జిగ, ఒఆర్‌ఎస్‌, కొబ్బరినీళ్లు ఇంకా ఇంటి వద్ధ అందుబాటులో ఉన్న ద్రావణాలు తరచుగా తీసుకోవాలన్నారు. పనుల నిమిత్తం ఉదయం ఇంటి దగ్గర బయల్దేరే ముందు తప్పని సరిగా ద్రవరూపంలో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, తాగు నీరు వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు వైద్య సిబ్బంది వద్ద గ్రామాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ను నీటిలో కలిపే విధానాన్ని అక్కడ వైద్య సిబ్బందిచే చేసి చూపించి, అక్కడ ప్రజలకు ఒఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తాగించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జగన్మోహన్‌ మాట్లాడుతూ వడదెబ్బకు గురయ్యే సమయంలో తలనొప్పి, తలతిరగడం, వికారం, జ్వరం, స్పహ కోల్పోవడం, అపస్మారక స్థితి మొదలగు లక్షణాలు ఉంటాయని వివరిస్తూ, ప్రాథమికంగా వెంటనే చేపట్టాల్సిన చర్యలను అందరికీ అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే దగ్గర్లో చల్లని నీడ ప్రదేశానికి తీసుకువెళ్లి, తడిగుడ్డతో శరీరాన్ని రుద్దుతూ ఉండాలని, స్పృహలో ఉన్నప్పుడే మాత్రమే నీరు తాగించలని అన్నారు. ఇంకా అపస్మారక స్థితిలో ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రానికి, ఆసుపత్రికి తరలించాలన్నారు. పిల్లలకు తరచుగా నీరు తాగించాలని, ఎవరికైనా జ్వరం అనిపిస్తే వెంటనే తెలియజేయాలన్నారు. దీర్ఘకాలిక రోగులు, గర్భిణీలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ గోపాల్‌, వైద్య సిబ్బంది గాయిత్రి, నరసమ్మ, వెంకటేష్‌,ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

➡️