ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: డిసెంబర్ 9వ తేదీ వరకు వచ్చిన క్లెయిమ్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన వేగవంతంగా జరుగుతోందని, 2024 జనవరి 5 ఓటర్ల జాబితాలను విడుదల చేయడం జరుగుతుందని, 22వ తేదీన జిల్లా ఎన్నికల పరిశీలకులు రానున్నారని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.రాజశేఖర్ అన్నారు. బుధవారం ఉదయం రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ మీటింగ్ హాల్లో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ డిసెంబర్ 9 వరకు వచ్చిన క్లైమ్లను వేగవంతంగా పరిష్కారం చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఫారం-6కు సంబంధించి దరఖాస్తులు నిరంతరం స్వీకరించడం జరుగుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో ఈవీఎంలపై అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని మండలస్థాయిలో కూడా పరిశీలించుకోవచ్చు అని అన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వివిధ దశలలో నిర్వహించబడుతున్నదని వివరించారు. ఎన్నికల జాబితాకు సంబంధించి పరిశీలకులు పోలా భాస్కర్ ఈనెల 22న జిల్లాలో పర్యటించనున్నారని 22 సాయంత్రం 4.30 గంటలకు సమావేశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నుంచి డిసిసి అధ్యక్షులు భాస్కర్, పరదేశి, బిజెపి నుంచి అట్లూరి శ్రీనివాసులు, వైయస్సార్ కాంగ్రెస్ నుంచి ఉదయకుమార్, టిడిపి నుంచి సురేంద్ర కుమార్, సూపరింటెండెంట్ బ్యూలా పాల్గొన్నారు.