మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: విద్యార్థులు చదువుతో పాటుగా మానవహక్కుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి డాక్టర్ ఐ.కరుణకుమార్ పేర్కొన్నారు. మంగళవారం ప్రిన్సిపల్ పి.జీవన్ జ్యోతి, జిల్లా బాలసంరక్షణ అధికారి సుబ్రహ్మణ్యం, సిడిపిఓ నిర్మల, సిఐ బాలయ్యలతో కలసి పివికెఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జడ్జి మాట్లాడుతూ 1948 సంవత్సరం యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జ్ఞాపకార్థం డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం జరువుకోవడం జరుగుతుందన్నారు. రాజ్యాంగం ప్రతిఒక్కరికి సమానస్వేచ్ఛ సమన్యాయం జీవించే హక్కులు కల్పించిందన్నారు. మన స్వేచ్ఛ కోసం ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తే కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. హక్కులతో పాటుగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల హక్కులకు భంగం కలిగించే వారుమవుతామాని, మన స్వేచ్ఛతో పాటుగా ఇతరులు కూడా స్వేచ్ఛగా జీవించేలా మన ప్రవర్తన ఉండాలన్నారు. అనంతరం బాలికల సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. వైఎస్ ప్రిన్సిపల్ మీరా సాహెబ్, ఎస్ఐ నాగసౌజన్య ఏఎస్ఐ వళ్లియమ్మ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.