ప్రజాశక్తి – అనకాపల్లి : అనకాపల్లి జిల్లా కేంద్రంలోని కొత్తూరు మేజర్ పంచాయతీ ముదిరాజ్ కాలనీలో శనివారం రాత్రి కత్తితో గొంతు కోసుకుని కాంట్రాక్టు లెక్చరర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అనకాపల్లి పట్టణ ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ప్రకారం, కొత్తూరు పంచాయతీ ముదిరాజ్ కాలనీకి చెందిన గుత్తికొండ ఉమాదేవి విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని తాటిపూడి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. 2011లో వివాహమైనప్పటికీ ఏడాది కాలంలోనే భర్త నుంచి వేరుపడి, జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉన్న ఆమె శనివారం రాత్రి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతి పలువురిని కలచివేసింది. విషయం తెలుసుకున్న తోటి అధ్యాపకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా భర్త వేధింపుల కారణంగానే తన కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలు ఉమాదేవి తండ్రి స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహానికి అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్టు పట్టణ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/akp.jpg)