ప్రజాశక్తి-అజిత్ సింగ్నగర్(విజయవాడ) : సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సిపిఎంకు మద్దతు తెలిపి ఓట్లు వేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు పేర్కొన్నారు. సిపిఎం అభ్యర్థులను బలపరచాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ.. సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్లోని శివాలయం 137బ్లాక్ నుండి 58వ డివిజన్లోకి మార్పుచేయాలన్నారు. బిజెపి-టిడిపి-జనసేన, వైసిపిలను ఓడించి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సెంట్రల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యం భారిన పడుతున్నారన్నారు. గత ప్రజాప్రతినిధులు కండ్రిక, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాలను పట్టించుకోలేదని ఆరోపించారు. సిపిఎం అభ్యర్థిని గెలిపిస్తే డిస్నీల్యాండ్లో ఉన్న 57 ఎకరాలు ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి బి.రమణ రావు, అధ్యక్షులు కే దుర్గారావు, సిపిఎం రాష్ట్ర కెవిపిఎస్ కార్యదర్శి మల్లాద్రి, సిపిఎం నాయకులు పి వి ఎస్ ఎన్ మూర్తి, నాగేశ్వరరావు, డివిజన్ ఇంఛార్జి చంద్రమణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.