లోతట్టు ప్రాంతాలు జలమయం
జలతిగ్బంధంలో కాకినాడ
స్తంభించిన జనజీవనం
ప్రజాశక్తి-కాకినాడ : మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ నగరంలో పరిస్థితులు తీవ్రంగా మారాయి. స్మార్ట్ సిటీ కాకినాడలో మంగళవారం రాత్రి పది గంటల నుండి బుధవారం వరకు కూడా ఎడతెరిపిలేని ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కురియడంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలోని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. రోడ్లు ఇల్లు నీట మునగడంతో జనజీవనం స్తంభించింది. ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. నగరంలో వ్యాపార సముదాయాలు వెలవెలబోయాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, కార్పొరేషన్ కార్యాలయం, సినిమా రోడ్డు, మెయిన్ రోడ్ లోని సీతారామ ఆలయం వద్ద, నూకాలమ్మ గుడి వీధి, రామారావు పేట ఏరియా, భానుగుడి జంక్షన్, శాంతినగర్ ఏరియా తో పాటుగా చాలా ప్రాంతాలు కుండపోత వర్షానికి నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలలో రహదారి గుంతల్లో వర్షపునీరు నిలిచి మరింత ప్రమాదకరంగా మారాయి. తీవ్ర తుఫాను నేపథ్యంలో పాఠశాలలకు బుధవారం కూడా అధికారులు సెలవు ప్రకటించడం జరిగింది. గత రెండు రోజులుగా కూడా వ్యాపార సముదాయాలు చాలావరకు మూతపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటిని వెంటనే బయటికి పంపి ఏర్పాట్లు చేయాలని ఆయా ప్రాంతాలలోని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.