ప్రజాశక్తి-గుర్ల : చంద్ర బాబునాయుడు మోసపూరిత మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం మన్యపురిపేట, దమరసింగి, కెల్ల తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత పాలనతో, అభివృద్ధే ధ్యేయంగా ఐదేళ్లు అభివృద్ధికి కృషి చేశామని ఆయన అన్నారు. ప్రతీ గ్రామాన్ని అభివృధ్ధి పథం లో ముందుకు తీసుకెళుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. వైసిపి ప్రభుత్వంలో ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని, మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. జగన్ ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేసి తీరుతారని, ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి కేరాఫ్ వైఎస్ఆర్ పార్టీని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తు న్నారని అన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా బెల్లాన చంద్ర శేఖర్ ను గెలిపించాలని అభ్యర్థించారు. జన్మ భూమి కమిటీల పేరుతో అర్హులను వదిలేసి సొంత పార్టీ వారికే పథకాలు అందేవని అన్నారు. ఆ పార్టీ నాయకులు మీ వద్దకు వచ్చి అవి చేస్తాం..ఇవి చేస్తామంటే నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ధీర ఫౌండేషన్ అధినేత బొత్స సందీప్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/botsa.jpg)