టిడిపి మేనిఫెస్టోను నమ్మొద్దు

May 7,2024 00:50

మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి – మాచర్ల :
తాను గత ఎన్నికల ముందు చెప్పిన పథకాలన్నీ అమలు చేశానని మూడు సార్లు సిఎంగా చేసిన చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎప్పుడు నేరవేర్చలేదని, మరోసారి కొత్త వాగ్ధానాలు, మేనిఫెస్టోతో వస్తున్నారని వైసిపి అధినేత, సిఎం జగన్‌ అన్నారు. సోమవారం మాచర్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. టిడిపి మేనిఫెస్టోను నమ్మద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. మీ కుటుంబంలో మా ప్రభుత్వం ద్వారా సహయం పొందితేనే మాకు మద్దతు తెలియజేయండని కోరారు. గత టిడిపి పాలనలో రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ చేయలేదన్నారు. వైసిపి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పధకాల ద్వారా అన్ని వర్గాలను ఆదుకున్నామని అన్నారు. ఈ పథకాలన్నీ చంద్రబాబు గతంలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మాచర్ల వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, నరసరావుపేట ఎంపి అభ్యర్ధి అనిల్‌కుమార్‌యాదవ్‌ను ప్రజలకు పరిచయం చేసి వారిని గెలిపించాలని కోరారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హెలికాప్టర్‌ దిగి బస్సు ద్వారా పట్టణంలో ప్రధాన రహదారి శ్రీనివాస మహల్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన సభా వేధిక వద్దకు వచ్చి అర్ధగంటపాటు ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భారీగా వైసిపి పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి జూలకంటి బ్రహ్మరెడ్డిపై పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. మాచర్లకు బ్రహ్మరెడ్డి వచ్చిన తరువాత కోట్లాటలు, ఫ్యాక్టనిజం పెరిగిందన్నారు. ఆయన రాకముందు నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సిఎం చేసేందుకు అందరం కలిసి పనిచేద్దామన్నారు.

➡️