ఒపిఎస్‌ ఇచ్చేవారికే ఓటు

Jan 28,2024 23:24
ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌'

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి

రానున్న ఎన్నికల్లో పాత పెన్షన్‌ విధానం(ఒపిఎస్‌)ను అమలు చేసేవారికే ఓటు వేస్తామని యుటిఎఫ్‌ సభలో పలువురు వక్తలు స్పష్టం చేశారు. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ‘ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌’ సభను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించారు. వేలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ సభకు తరలొచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పెన్షన్‌ బిక్ష కాదు హక్కు అని మరోసారి గుర్తు చేశారు. అనేక పోరాటాల ఫలితంగా ఉద్యోగులకు పెన్షన్‌ సౌకర్యం అమల్లోకి వచ్చిందన్నారు. ఉద్యోగులకు నష్టం వాటిల్లేలా సిపిఎస్‌ను ప్రభుత్వాలు తీసుకొచ్చాయన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉద్యోగులకు సిపిఎస్‌ అమలువుతుందన్నారు. పాత పెన్షన్‌ విధానంపై రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. వైసిపి ప్రభుత్వం అమలుల్లోకి తెచ్చిన జిపిఎస్‌ కూడా సిపిఎస్‌ వంటిదేనని ఆయన స్పష్టం చేశారు. మరో పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సిపిఎస్‌, జిపిఎస్‌ తెచ్చిన వారిని ఓడించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ 50ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని ఆయన గుర్తు చేశారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం పోలీసుల సహకారంతో అణచితకు గురిచేస్తుందన్నారు. ఇది సరైన పద్దతికాదన్నారు. ఉపాధ్యాయులను నేరస్తులుగా చూడటం తగదన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మంతెన సీతారాం మాట్లాడుతూ పాత పెన్షన్‌ కోసం జరిగే పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో రాజకీయపార్టీలు ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం గెలిచిన తరువాత కార్పొరేట్లకు సేవచేయడం ఆనవాయితీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుటిఎఫ్‌ తలపెట్టిన పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిపిఎస్‌లో డొల్లతనాన్ని వివరించారు. గ్యారెంటీ లేని పెన్షన్‌కు గ్యారెంటీ పేరు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో అమలవుతున్న ఇలాంటి పెన్షన్‌ పథకం వల్ల అక్కడ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నామని, దీనికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఒపిఎస్‌ను మేనిఫెస్టోలో చేర్చడంతో పాటూ మొదటి సంతకంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎంఎల్‌సి ఎంవిఎస్‌.శర్మ మాట్లాడుతూ ఒపిఎస్‌ దేశ వ్యాప్త సమస్యగా మారుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో సిపిఎస్‌ రద్దు నినాదం దిశా నిర్దేశం చేస్తుందన్నారు. ఇపిఎఫ్‌-95 ఉద్యోగులకు ఇప్పటికీ కొదిపాటి పెన్షనే వస్తుందన్నారు. దీంతో వారు ఆర్థిక ఇబ్బందులతో నానా అవస్థలు పడుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌కు ఏ రాజకీయ పార్టీ నుంచీ మద్దతు లభించకపోతే శాసన సభలకు సొంతంగా ప్రతినిధులను పంపేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ఉన్న సిపిఎస్‌ బాధితుల వివరాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు, సిపిఐ నాయకులు జ్యోతిరావు, ఆప్‌ రాష్ట్ర నాయకులు వై.శ్రీనివాసరావు, బిఎస్‌పి నాయకులు పట్నాల విజరుకుమార్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు మనోహర్‌, అరుణకుమారి, గోపి మూర్తి, జ్యోతిబసు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.జయకర్‌, ఎస్‌కె.షరీఫ్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కొమ్మోజు శ్రీనివాసరావు, కె.సురేష్‌కుమార్‌, జివి.రమణ, హనుమంతరావు, ఉమాశంకర్‌, కుమార్‌ రాజా, లక్ష్మీరాజా, రెడ్డి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.ఫిబ్రవరి నుంచి ఉద్యమ కార్యాచరణఒపిఎస్‌ సాధనకు ఫిబ్రవరి నుంచి ఉద్యమ కార్యాచరణను యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ వివరించారు. ఫిబ్రవరి 12 నుంచి మండల స్థాయిలో ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 25 నుంచి 28 వరకూ జిల్లా స్థాయిలో అన్ని రాజకీయపార్టీల నాయకులను కలిసి ఈ మేరకు వినతిపత్రాలు ఇవ్వాలని తెలిపారు. మార్చి నుంచి ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పేరుతో ప్రతి ఇంటికీ, వాహనాలకు స్టిక్కర్లు అంటించాలని అన్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభల్లో ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ ప్లకార్డులను ప్రదర్శించాలన్నారు. మార్చి 15 తర్వాత చర్చావేదికలు, 26 నుంచి 30 వరకూ బైకు ర్యాలీలు నిర్వహించాలని కోరారు. హోరెత్తిన రాజమహేంద్రవరంయుటిఎఫ్‌ సభ నేపథ్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల నినాదాలతో రాజమహేంద్రవరం నగరం హోరెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు వేలాది సంఖ్యలో ప్రదర్శనగా సభా స్థలికి చేరుకున్నారు. వేలాదిమంది మహిళా ఉపాధ్యాయులు ఈ సభకు తరలొచ్చారు. సిపిఎస్‌ రద్దు చేయాలని, ఒపిఎస్‌ను పునరుద్ధరించాలి, సిపిఎస్‌ ఇచ్చేవారికే మా ఓటు అంటూ నినదించారు.

➡️