ఆర్టిసి డిఎం, కమర్షియల్ మేనేజర్లకు నాయకుల వినతి
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
ఎపిఎస్ఆర్టిసి కాంట్రాక్ట్, అవుట్స్సోంగ్ కార్మికులకు వేతనాలు కోతలు లేకుండా ఇవ్వాలని ఎపిఎస్ఆర్టిసి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి.పవన్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ మంగళవారం రాజమహేంద్రవరం ఆర్టిసి డిపో మేనేజర్ ఎస్.కె.షబ్నం, కమర్షియల్ మేనేజర్ కె.మధులకు వినతిపత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజమహేంద్రవరం ఆర్టిసి డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలను చట్ట ప్రకారం చెల్లించకుండా, కాంట్రాక్టర్ కోత పెడుతున్నారన్నారు. ఫలితంగా ఒక్కో కార్మికుడు రూ.2వేల నుంచి రూ.3వేల వరకూ నష్టపోతున్నారన్నారు. అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, డేటా ఎంట్రి ఆపరేటర్స్, స్వీపర్లకు ఇచ్చే వేతనాల్లో కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో కోత విధిస్తున్నారన్నారు. లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. నెలకు నాలుగు వారంతపు సెలవులు, పబ్లిక్ హాలిడేస్ వంటి సెలవులను కూడా సక్రమంగా ఇవ్వట్లేదన్నారు. విశాఖ వంటి డిపోలో అవుట్సోర్సింగ్ కార్మికులకు చట్ట ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నారని, దానిని పరిగణలోకి తీసుకుని రాజమహేంద్రవరం డిపోలో కూడా కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టిసి రాష్ట్ర కార్పొరేషన్ 2023 నవంబర్ 15న ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా పెరిగిన జీతాలను నేరుగా కార్మికులు, ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు పతినెలా 10వ తేదీలోపు జమ చేయాలని డిమాండ్ చేశారు. పిఎఫ్ అమౌంట్ కార్మికుల ఖాతాలో జమ చేసి రశీదులను ఇవ్వాలన్నారు.