ప్రజాశక్తి – తాళ్లపూడి, చాగల్లు
జవహర్ వద్దు టిడిపి ముద్దు నినాదంతో మండలంలోని టిడిపి యువగళం నాయకులు గురువారం రెండు బస్సుల్లో నియోజకవర్గ కేంద్రం కొవ్వూరుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా యువగళం నాయకులు కాకర్ల సత్యేంద్ర తాళ్లపూడి బస్టాండ్ సెంటర్లో మాట్లాడారు. మాజీ మంత్రి కెఎస్.జవహర్ పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు సష్టిస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కారణంగా 2019లో జవహర్ ఓడిపోయారన్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ కోసం పని చేసే వారిని పట్టించుకోకుండా వేరే వారికి పదవులు కట్టబెట్టి విభేదాలు సష్టిస్తున్నారన్నారు. ఎన్నికలకు కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ జవహర్కు కాకుండా మరొకరికి ఇవ్వాలన్నారు. చాగల్లు మండలంలోని టిడిపి నాయకులు గురువారం మధ్యాహ్నం టిడిపి సీనియర్ నాయకులు ఆళ్ల హరిబాబు, నాదాల శ్రీరామ్చౌదరి, పట్టణ అధ్యక్షులు దొంగ రామకృష్ణ ఆధ్వర్యంలో చాగల్లు మండలం నుంచి కొవ్వూరుకు పయనమయ్యారు. బైకులు, కార్లపై వారు ర్యాలీగా కొవ్వూరుకు వెళ్లారు.