ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్
జిల్లా వ్యాప్తంగా 1,569 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడారు. జిల్లాలో జనవరి 22 తదుపరి చేపట్టిన ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపు తదితర అంశాలపై వివరాలను ఇప్పటికే తెలియజేశామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గ దర్శకాలు మేరకు పోలింగ్ కేంద్రాల విషయంలో సహేతుకమైన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందులో భాగంగా రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంటామన్నారు. ముఖ్యంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పు, పేర్లు మార్పు, 1,500 పైబడి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను ఎ, బిలుగా విభజన చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కోసం సంభందిత నియోజక వర్గ ఈఆర్ఒలకు ప్రతిపాదనలు ఇవ్వొచ్చన్నారు. ఆయా రాజకీయ పార్టీల ద్వారా వచ్చే ప్రతిపాదనలు, జిల్లా, నియోజక వర్గ ఎన్నికల అధికార యంత్రాంగం ప్రతిపాదన చేసిన వాటినీ రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవటం ద్వారా ప్రతిపాదన పంపుతామని చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్ఒ జి.నరసింహులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్.రమేష్, బి.రామచంద్రరావు, ఎన్.సుబ్రహ్మణ్యం, ఎస్ఎస్.మూర్తి, సి.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు