ఎమ్మెల్యే చినరాజప్ప
ప్రజాశక్తి-సామర్లకోట : మహిళా సాధికారత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక ముందడుగు వేయడం జరిగిందని పెద్దాపురం శాసన సభ్యులు, పెద్దాపురం టి.డి.పి, జనసేన ఉమ్మడి అభ్యర్ధి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట మండలం అచ్చంపేట తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కలలకు రెక్కలు అనే పేరుతో ఓ సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ఆడబిడ్డ కూడా చదువుకు సంబంధించి డబ్బుల కొరతతో ఇంటికి పరిమితం కాకూడదనే ఆలోచనతో నూతన పథకాన్ని తీసుకుని రావడం జరిగిందన్నారు. మహిళలకు వృత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటు వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని,ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు.రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డ కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ కలలతో రాజీ పడకుండా వారి లక్ష్యాలను చేరుకునే దిశగా ఈ పథకం అడుగులు వేయిస్తుందనీ రాజప్ప తెలిపారు. ఈ పథకం కింద నమోదు చేసుకున్న మహిళలు తీసుకునే బ్యాంక్ లోన్ కు తెలుగుదేశం – జనసేన ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత (హమీ) వహిస్తుందనీ,ఈ పథకం కింద కోర్సుల కోసం మహిళలు తీసుకునే మొత్తం రుణానికి సంబంధించిన వడ్డీని కూడా టీడీపీ- జనసేన ఉమ్మడి ప్రభుత్వం చెల్లిస్తుందనీ ఆయన అన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/Another-step-forward-for-women-empowerment.jpg)