ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ వరి పంట కోసిన తరువాత మిగిలిన వరి గడ్డిని కాల్చి వేయకుండా దాన్ని వేస్ట్ డీకంపోజర్ ద్వారా పొలంలోనే కుళ్ళబెట్టి సేంద్రీయ పదార్థాన్ని పెంచే విధానాన్ని రైతులకు అవగాహన కల్పించాలని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ కళాశాల జాతీయ సేవా పథకం ప్రణాళికలో భాగంగా దొమ్మేరులో శనివారం మట్టినమూనా సేకరణ, క్షేత్రసందర్శన, వేస్ట్ డికంపోజర్ తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంట కోసిన తరువాత మిగిలిన వరి గడ్డిని కాల్చి వేయకుండా దాన్ని వేస్ట్ డీకంపోజర్ ద్వారా పోలంలోనే కుళ్ళబెట్టి సేంద్రీయ పదార్థాన్ని పెంచే విధానాన్ని రైతులకు అవగాహన కల్పించినట్టు చెప్పారు. డీకంపోజర్ను ఉపయోగించి పేడ, కూరగాయల వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు, ఎండు కర్రలు, బెరడులను వేగంగా కుళ్లివేయవచ్చు. దాని నుంచి వచ్చే కంపోస్ట్ మట్టి ఎరువుగా ఉపయోగించవవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ కె.దక్షిణామూర్తి, డాక్టర్ సిహెచ్.సునీత, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్స్ డాక్టర్ టి.ఉషారాణి, డాక్టర్ డి.శేఖర్ పాల్గొన్నారు.