జెసి లావణ్య వేణి
ప్రజాశక్తి – ఏలూరు
జిల్లాలో రబి పంట కాలం 2023-24కు సంబంధించి 2,40,000 మెట్రిక్ టన్నుల లక్ష్యానికి ఇప్పటి వరకు 1,97,852 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించుటకు రైతులు నమోదు చేసుకున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి తెలిపారు. అందులో భాగంగా ఇంతవరకు 1,79,530 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆన్లైన్ ద్వారా కోనుగోలు చేసి అనుసంధానం చేయబడిన రైస్ మిల్లులకు రాండమ్ సెలెక్షన్ ద్వారా తరలించడం జరిగిందన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.359.83 కోట్లకు ఇంతవరకు రూ.238.22 కోట్లు రైతుల వ్యక్తిగత ఖాతాకు జమ జేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ముదినేపల్లి, పోలవరం మండలానికి ఖరీఫ్ సీజనులో మిగిలిపోయిన 172 మెట్రిక్ టన్నుల ధాన్యమును కూడా కోనుగోలు చేయటం జరిగిందన్నారు. ఎక్కడైన టెక్నికల్, గోనెసంచులు, వాహనములు గురించి ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే త్వరితగతిన పరిష్కరిస్తున్నామన్నారు. కావున ఇంకా కొనుగోలు చేయవలసిన ధాన్యం పూర్తి మొత్తంలో ఎటువంటి ఇబ్బందిలేకుండా కొనుగోలు చేస్తామని తెలిపారు.