కడపలో జగన్‌కు ఝలక్‌!

ప్రజాశక్తి – కడప ప్రతినిధి కడపలో వైసిపి ఓటమికి కుతంత్రం నడిచింది. కడప అసెంబ్లీ అభ్యర్థి ఎస్‌బి.అంజాద్‌బాషా, పార్లమెంట్‌ అభ్యర్థి వైఎస్‌.అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా కడపకు చెందిన ఓ కీలక నాయకుడి వెన్నుపోటు రాజకీయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈయన సహకారంతో మరో ఏడుగురు కార్పొరేటర్లు సైతం టిడిపి ఎరకు లొంగిపోయినట్లు సమాచారం. ఫలితంగా కడప అసెంబ్లీపై ముస్లిం మార్క్‌ తొలగిం చడానికి సహకారం అందించినట్లు తెలుస్తోంది. ఫలితం గా కడప అసెంబ్లీలో వైసిపి గెలుపు కోసం పోటాపోటీ పరిస్థితి తీసుకు రావడం చర్చనీయాంశంగా మారింది. కడప అసెంబ్లీ పరిధిలో 2.83 లక్షల ఓటర్లు ఉన్నారు. ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో 65.27 శాతం నమోదైంది. కడప అసెంబ్లీ బరిలో వైసిపి తరపున డిప్యూటీ సిఎం ఎస్‌బి.అంజాద్‌బాషా, టిడిపి తరుపున మాధవి, కాంగ్రెస్‌ తరుపున ఆప్జల్‌ఖాన్‌ ప్రధాన పార్టీల తరుపున అభ్యర్థులుగా పోటీ పడిన సంగతి తెలిసిందే. కడప జిల్లా ఎన్నికల చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా ముగ్గురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. వైసిపి నాయకుల వెన్నుపోటు, లొంగుబాటు కారణాలు కావడం విస్మయాన్ని కలిగిస్తోంది.రచ్చ గెలవడంలో డిప్యూటీ సిఎం సార్వత్రిక ఎన్నికల టికెట్‌ను దక్కించుకోవడంలో ఇంటిపోరు గెలిచిన డిప్యూటీ సిఎం.అంజాద్‌బాషా, వీధిపోరును గట్టెక్కడంలో ఎదురీదుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయనకు సన్నిహితుడైన ఓ కీలక వైసిపి నాయకుని వెన్ను పోటు కారణంగానే గెలుపు కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి దాపురించిందనే చర్చ నడుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 53 వేల ఓట్లపైచిలుకు గెలిచిన నాయకుడు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వెన్నుపోట్ల కారణంగా పోరాటం చేయాల్సిన రావడం గమనార్హం. వెన్నుపోట్లు…లొంగుబాట్లువైఎస్‌ జగన్‌ రెండవ టర్మ్‌లో ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ప్రతి సీటు కీలకం. ఇటువంటి సంగతి తెలిసినప్పటికీ కడప నగరానికి చెందిన సదరు నాయకుడు, ఓ అధికారి మధ్య వర్తిత్వంతో ప్రత్యర్థితో డీల్‌ కుదుర్చుకుని వెన్నుపోటుకు తెర తీశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతటితో ఆగకుండా మరో ఏడుగురు కార్పొరేటర్లు సైతం ప్రత్యర్థికి లొంగి పోయి సైలెంట్‌గా వ్యవహరించారానే విమర్శలు ఉన్నా యి. సదరు నాయకుడు పార్టీలోనూ, పార్టీయేతర కీలక పదవిలోనూ కొనసాగుతూ ఇలా చేయడమేమిటనే చర్చ నడుస్తోంది. ఫలితంగా సదరు కీలక నాయకుడి పరిధి లోని ఓ సామాజికవర్గపు ఓటర్లు టిడిపి అభ్యర్థి వైపు మొగ్గు చూపిస్తున్నారని తెలిసినప్పటికీ ప్రేక్షకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. లొంగుబాటు నాయకులు జగన్‌కు ఝలక్‌ ఇచ్చినట్లు అవుతోందనే వాదన వినిపిస్తోంది. కడప అసెంబ్లీ పరిధిలో ప్రభావిత సామాజిక వర్గాలైన ముస్లిమ్‌, క్రిస్టియన్‌ ఓటర్లను ప్రత్యర్థులైన టిడిపి, కాంగ్రెస్‌ కొల్లగొట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యులైన సదరు వైసిపి నాయకులు కలిసి కట్టుగా శ్రమించాలి. ఎటువంటి ప్రయత్నమూ చేయకుండా, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి. ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా ప్రత్యర్థుల ఎరకు లొంగిపోయి, పార్టీకి, వైఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రి అవకాశానికి వెన్నుపోటు పొడవడం చర్చనీయాంశంగా మారింది.

➡️