అంగన్వాడీలను దోషిలుగా చిత్రీకరించడం సబబు కాదు
చేతనైతే అంగన్వాడీలకు జీతం పెంచండి : అంగన్వాడీల నిలదీత
ప్రజాశక్తి-మైదుకూరు : రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను దోషిలుగా వీడియోలు చిత్రీకరించడం సబబు కాదని మైదుకూరు పట్టణంలో రాష్ట్ర ఫుడ్ కమిటీ చైర్మన్ చిత్తా విజయ్ కుమార్ రెడ్డిని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిలదీశారు. శుక్రవారం చిత్త విజయ్ కుమార్ రెడ్డి కారును అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మీరు తీస్తున్న వీడియోలలో అంగన్వాడీ కార్యకర్తలకు రూ.6వేలు కూడా ఎక్కువే అంటూ వీడియో పోస్ట్ చేయడం సబబు కాదని వెంటనే అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలంటూ నిలదీశారు. స్పందించిన చిత్తా విజయ్ కుమార్ రెడ్డి నేను తీసిన వీడియోను మీకు ఎవరో కట్ చేసి పంపారంటూ సమాధానం ఇచ్చారు. నేను అంగన్వాడి కార్యకర్తలకు అనుకూలంగా ఉంటానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో వీలైనంత త్వరగా మాట్లాడి అంగన్వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు న్యాయం జరిగేలా చూస్తానంటూ హామీ ఇచ్చారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు శాంతించారు. కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, సిపిఎం, సిపిఐ, ఎంఆర్పిఎస్ నేతలు పాల్గొన్నారు.