ప్రజాశక్తి-కడప అర్బన్
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు నెల్లూరు పట్టణంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి స్మారక విజ్ఞాన కేంద్రంలో రెండు రోజులపాటు నిర్వహించారు. ఈ సమావేశాలలో యుటిఎఫ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ పథకాన్ని రాష్ట్ర సంఘం ప్రవేశపెట్టింది. ఈ పథకానికి రాష్ట్ర ట్రెజరర్గా కడప జిల్లాకు చెందిన యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నిక పట్ల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధన విజయకుమార్, పాలెం మహేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర కుటుంబ సంక్షేమ పథకంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్లు, జిల్లా ఆఫీస్ బేరర్లు సభ్యులుగా ఉంటారని ఇందులో సభ్యత్వం కలిగిన ఉపాధ్యాయులు మరణించినా, ప్రమాదాలలో తీవ్రంగా గాయపడినా, అనారోగ్యాల పాలైన ఆర్థికంగా ఆదుకుంటారని తెలిపారు. కుటుంబ సంక్షేమ సంఘం ఉపాధ్యాయుల కుటుంబానికి భరోసాను కల్పించే విధంగా ఉంటుందని, ఈ పథకంలో సభ్యులైన వారు 75 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగవచ్చునని తెలిపారు.