ప్రజాశక్తి-కాకినాడ ఓటరు జాబితాపై దాఖలైన దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అమరావతి నుంచి శుక్రవారం అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కృతికాశుక్లా హాజరయ్యారు. లోక్సభ, శాసనసభ ఎన్నికల సన్నద్ధత, ఫారం 6, 7, 8ల పరిష్కారం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఇవిఎంల రిపోర్టు, సి-విజిల్ రిపోర్టు, రాజకీయ పార్టీల ప్రచారం అనుమతులు మంజూరు, పోస్టల్ బ్యాలెట్ వంటి అంశాలపై సిఇఒ ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ప్రవర్తన నియమావళికి తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సిఇఒకు వివరించారు. జిల్లాలో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను పటిష్టంగా నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా ముద్రించిన దగ్గర నుంచి ఓటరు జాబితాపై దాఖలైన దరఖాస్తులను గడువులోపు పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి.తిప్పే నాయక్, ఎన్నికల డిటి ఎం.జగన్నాథం పాల్గొన్నారు.