ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
ఇష్టపడి, కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని పిడిఎఫ్ ఎంఎల్ఎసిలు కెఎస్. లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవి) అన్నారు. సోమవారం కాకినాడ అంబెడ్కర్ భవన్లో గ్రూప్స్, డివైఇఒ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు యుటిఎఫ్, జెవివి, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరై అవగాహన సదస్సును సద్వినియోగం చేసు కున్నారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు ”భారత సమాజం” ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ’ అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనేక అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ తాము మెటీరియల్ రూపొందించామని తెలిపారు. పోటీ పరీక్షలపై భయాన్ని వీడి కష్టపడి చదవడం ద్వారా సునాయాసంగా విజయం సాధించ వచ్చునని తెలిపారు. అనంతరం లక్ష్మణరావుచే రూపొందించబడిన భారత సమాజం అనే స్టడీ మెటీరియల్ను ఎంఎల్సి ఐ.వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనే స్టడీ మెటీరియల్ను యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.అన్నారాము, పూర్వపు రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభాకర వర్మ అవిష్కరించారు. ఈ సందర్భంగా ఐవి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రూప్స్, డిఎస్సి, సచివాలయం ఉద్యోగార్థులకు పిడిఎఫ్ ఎంఎల్సిల అధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించడం జరుగుతుం దన్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, అయితే ప్రస్తుతం ఇస్తున్న నోటిఫికేషన్లో కేవలం 6 వేల టీచర్ పోస్టులు మాత్రమే భర్తీ చేయడం చాలా దారుణమన్నారు. డిఎస్సి, గ్రూప్స్ నోటిఫికేషన్లలో పోస్టులు పెంచాలని శాసన మండలి సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. అనంతరం అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ అవగాహన సదస్సులో యూటిఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెవివి.నగేష్, టి.రవిచక్రవర్తి, జెవివి జిల్లా అధ్యక్షులు కెఎంఎంఆర్.ప్రసాద్, సిఐటియు నాయకులు పి.వీరబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.సూరిబాబు, డివైఎఫ్ఐ నాయకులు పి.డి ప్రసాద్, యుటిఎప్ సహాధ్యక్షులు వివి.రమణ, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్.సూరిబాబు, ఏ.సీతారామరాజు, సిహెచ్వి.రమణ, వరహాలు, సుమారు వెయ్యి మంది అభ్యర్థులు పాల్గొన్నారు.