ప్రజాశక్తి – సామర్లకోట
నిత్యం జనసంచారం వాహనాల రద్దీతో ఉండే టిటిడి కళ్యాణ మండపానికి వెళ్లే రహదారిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎర్త్ కోసమని ఏర్పాటు చేసిన పైపునకు విద్యుత్ సరఫరా వస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ప్రదేశం కావడంతోపాటు చెంతనే ఉన్న అన్నా క్యాంటీన్ భవనంలో జగ్గమ్మగారి పేటకు చెందిన మున్సిపల్ పాఠశాల ఉంది. ఆ విద్యార్డులు సైతం విశ్రాంతి సమయంలో ట్రాన్స్ఫార్మర్ సమీప ప్రాంతంలోనే ఆటలు ఆడుకుంటూ గడుపు తున్నారు. ఎవరు గమనించలేని విధంగా భూమిలో పాతిపెట్టిన ఎర్త్ పైపునకు నేరుగా విద్యుత్ సరఫరా అవుతూ చిన్న బల్బు మాదిరిగా స్పార్క్ వచ్చి ఉంటుంది. పగటి సమయంలో దాని కాంతి అంతగా కనిపించకుండా ఉంటున్నందున విద్యార్థులు, ప్రజలు దానిని గమనించడం కష్టతరంగా మారింది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ అధికారులు తక్షణం స్పందించి ఎర్త్ పైపునకు వస్తున్న విద్యుత్ను క్రమబద్దీకరించి ట్రాన్స్ఫార్మార్ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.