ప్రజాశక్తి-కాకినాడ, కాకినాడ రూరల్ ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు నిర్మించే లక్ష్యంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శనివారం కాకినాడ జెఎన్టియు ఎదురుగా ఉన్న మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంఎల్సి కర్రి పద్మశ్రీ, కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ ఎంఎల్ఎ కురసాల కన్నబాబు, జాయింట్ కలెక్టర్ సివి.ప్రవీణ్ ఆదిత్య, కుడా ఛైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి ఇతర ప్రజాప్రతినిధులు హాజరై ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గానికు సంబంధించి కాకినాడ పట్టణంలోని 8 వార్డుల్లో గుర్తించిన 2,812 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. గతంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 2,400 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని, ఇప్పటివరకు 8 వార్డుల్లో 5,224 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. కాకినాడ నగర పరిధిలోని 50 వార్డులలో గుర్తించిన 33,855 మంది అర్హులైన లబ్ధిదారుల కోసం 12 లేఔవుట్లలో ఇళ్ల స్థలాలు సిద్ధం చేసినట్టు చెప్పారుర. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన సామాగ్రి, మౌలిక సదుపాయాలను రూ.750 కోట్ల నిధులతో కాకినాడ నగర లబ్ధిదారులకు కేటాయించిన లేఔవుట్లలో అభివద్ధి చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 1,20,000 ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని, 70 వేల ఇళ్లు మంజూరు అయ్యాయని అందులో ఇప్పటివరకు 30 వేల వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.వెంకటరావు, అడిషనల్ కమిషనర్ సిహెచ్.నాగ నరసింహారావు, కాకినాడ ఆర్డిఒ ఇట్ల కిషోర్, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి, మాజీ మేయర్ సుంకర శివ ప్రసన్న, జెడ్పిటిసి ఎన్.రామకృష్ణ, ఎఎంసి చైర్మన్ పశుపులేటి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
![ప్రతి పేద కుటుంబానికీ ఇంటి పట్టా](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Untitled-1-copy-89.jpg)