ప్రజాశక్తి – సామర్లకోటవిద్యార్థుల్లో తరగతుల వారీగా ఆయా సబ్జెక్ట్ల్లో నైపుణ్యాలు పెరగకపోతే, సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని డిఇఒ రమేష్ హెచ్చరించారు. సామర్లకోట మండలం అచ్చంపేట యుపి పాఠశాలను, నవర జిల్లా పరిషత్ హైస్కూల్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్రతి పాఠశాలలో అకడమిక్ పరంగా ప్రతి విద్యార్థి తరగతుల వారీగా ఇంప్రూవ్మెంట్ లేకపోతే సంబంధిత ప్రధానోపాధ్యాయులు, టీచర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి విద్యార్థికీ చదవడం, రాయడం ఖచ్చితంగా రావాలని చెప్పారు. అచ్చంపేట యుపి పాఠశాలలో విద్యార్థులు తరగతుల వారిగా చదవడం మరియు రాయడం అభ్యసనా సామర్థ్యాలను డిఇఒ పరిశీలించారు ప్రభుత్వం ఇచ్చిన వర్క్ బుక్స్ తరగతివారీగా ఫిబ్రవరి సిలబస్కు అనుగుణంగా పూర్తి చేయాలన్నారు. సిలబస్ పూర్తికాక, వర్క్ బుక్కులు పూర్తి చేయకపోతే మెమోలు జారీ చేస్తామన్నారు. ప్రతి విద్యార్థీ అకాడమిక్ పరంగా చదవాల్సిన విషయాలపై పాఠశాల ప్రధానో పాధ్యాయులు ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టాలని తెలిపారు. అకడమిక్ పరంగా విద్యార్థి చదవకపోయినా రాకపోయినా సంబంధిత పాఠశాలల ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులదే బాధ్యతని చెప్పారు. ప్రతి పాఠశాలా పరిశుభ్రంగా ఉండాలని ప్రతి హైస్కూల్లో ఇంటిగ్రేటెడ్ ప్లాట్ ప్యానెల్ ప్రతిరోజు వినియోగించేలా చూడాలని తెలిపారు. నాడు-నేడులో భాగంగా కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చించిందని పనులు త్వరలో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ప్రతి పాఠశాలలోనూ మినరల్ వాటర్ సదుపాయం కల్పించామని చెప్పారు. పాఠశాల ఆవరణలో తరగతి గదులు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. విద్యార్థులు యూనిఫారం, జెవికె కిట్ తప్పనిసరిగా ఉపయోగించే విధంగా చూడాలన్నారు. అనంతరం నవర హైస్కూల్ను పరిశీలించారు. ఆయన వెంట ఎంఇఒ పి.పుల్లయ్య, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసు, సత్యవతి ఉన్నారు.
![విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగాలి](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Untitled-1-copy-207.jpg)