ప్రజాశక్తి – పిఠాపురం
నియోజకవర్గంలోని గాండ్ల తెలుకుల, దేవ తిలకుల ఐక్యకార్యచరణ సమితి ప్రతినిధులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయా సామాజికవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రం రూపంలో నాగబాబుకు అందచేశారు. ఈ సమావేశంలో సమితి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షలకు పైగా జనాభా కలిగిన గాండ్ల కులస్తులు నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నామని అన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా పరమైన అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి సహకారం లేక 70 శాతం కుటుంబాలు కుల వృత్తికి దూరమై కూలీలుగా బ్రతకాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు కనీసం 300 యూనిట్ల వరకూ విద్యుత్ రాయితీ ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు బాలాజీ, సమితి ప్రతినిధులు గోసు సుబ్బారావు, అడ్డా వీర వెంకట రాజు, దాడి సత్యనారాయణ, చిట్టాల సూర్యనారాయణమూర్తి, బొర్రా మధుసూదన్, కాశిన సత్యనారాయణ, తిరుపతి హరగోపాల్ పాల్గొన్నారు.