ప్రజాశక్తి – కాకినాడ
డ్రెయినేజీలపై అక్ర మంగా నిర్మించిన శాశ్వత కట్టడాలను తక్షణమే తొలగించాలని నగర పాలక సంస్థ కమిషనర్ జె.వెంకటరావు ఆదేశించారు. గురువారం ఆయన స్థానిక ఆర్టిసి కాంప్లెక్స్ సమీపం లోని రైతుబజార్ను సందర్శించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. రైతు బజార్ లో రోజువారి ఉత్పత్తి అయ్యే కూరగాయల వ్యర్ధాల తరలిం పుతోపాటు, ఇతర సమస్యలపై ఆరా తీశారు. అదే ప్రాంగణంలో డ్రెయినేజీలను ఆక్రమించి వ్యాb ారాలు సాగిస్తున్న తీరును గుర్తించారు. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. అలాగే స్థానిక సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు శుక్రవారం సాయంత్రం రైతుబజార్ వ్యాపారులు, ఇతర అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. అనంతరం 9వ సర్కిల్లోనూ, సాంబమూర్తి నగర్ ప్రాంతాలలో జరుగుతున్న పూడికతీత పనులను కమిషనర్ పర్యవేక్షించారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డి-సిల్టేషన్ పనులను మరింత వేగవంతం చేసి వర్షాలు పడే సమయానికి ఎక్కడా ముంపు ఏర్పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో ఎంహెచ్ఓ డాక్టర్ పథ్వీ చరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, రాధాకృష్ణ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.