వెల్ల గ్రామం వద్ద గల వాటర్ ట్యాంకు పరిశీలిస్తున్న అధికారులు
ప్రజాశక్తి-రామచంద్రపురం
వేసవిలో మంచినీటి అవసరాలు పెరుగుతాయని దానికి అనుగుణంగా పట్టణంలోని ప్రజలకు నిరంతరాయంగా మంచినీటిని సరఫరా చేసుందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాసులు సూచించారు. మంగళవారం వెల్ల వాటర్ ప్లాంట్ ను ఆయన డిఇ, దుర్గాప్రసాద్, ఇతర అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఇక్కడ 25 ఎకరాల్లోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లో మూడు నెలలకు సరిపడా మంచినీరును సిద్ధం చేసుకోవాలని, మంచినీటి క్లోరినేషన్ పరిశుభ్రత విషయంలో రాజీ లేకుండా స్వచ్ఛమైన మంచినీటిని అందించాలని ఆయన వాటర్ ప్లాంట్ నిర్వాహకులకు ఆదేశించారు. వెల్ల ట్యాంకు 500 మిలియన్ లీటర్ల కెపాసిటీతో మొత్తం పట్టణంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు అందిస్తుందని దీనిని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం సరఫరా అవుతున్న మంచినీటిని వారు పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం వాటర్ ప్లాంట్ చుట్టూ గల కొబ్బరితోటను,మామిడి పండ్ల మొక్కలును మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసు, డిఇ పరిశీలించి సిబ్బంది కి వేసవిలో మొక్కలకు నీటి ఎద్దడి రాకుండా పలు సూచనలు చేశారు. వారి వెంట వాటర్ ట్యాంక్ సప్లై సిబ్బంది, ఫిట్టర్,ఎలక్ట్రీషియన్ తదితరులు పాల్గొన్నారు.