సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిడిఓ బి.కృష్ణ మోహన్
ప్రజాశక్తి-అమలాపురం
అల్లవరం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శనివారం ఎంపిడిఒ బి.కృష్ణ మోహన్ అధ్యక్షతన గోదావరి వరద ముందస్తు జాగ్రత్తలు, ఖరీఫ్ వరి సాగుకు రైతులను సమాయత్తం చేయడం పై వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఒలు, వ్యవసాయ సహాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఎంపిడిఒ బి.కృష్ణ మోహన్ మాట్లాడుతూ జూన్ లోనే రుతు పవనాల అగమనంతో వర్షాలు భారీగా కురిసి మండలంలోని బోడసకుర్రు, గోపాయి లంక, గోడి, బెండమూరు లంక గ్రామాల్లో వైనతేయ కు వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. దీంతో ఏటి గట్టు పటిష్టత, ఎక్కడైనా గండ్లు పడే అవకాశాలు ఉన్నాయా అన్న అంశంపై సచివాలయం సిబ్బంది ద్వారా క్షుణ్ణంగా పరిశీలన చేయించి ఈ నెల 29వ తేదీ లోపు గ్రామాల వారీగా నివేదికలు ఇవ్వాలని కార్యదర్శులను, విఆర్ఒలను ఆదేశించారు. ఖరీఫ్ లో రైతులకు సాగు నీరు, మురుగు పారుదల ఇబ్బందులు లేకుండా ఆయకట్టు పరిధిలో వ్యవసాయ సహాయకులు, విఆర్ఒలు, లస్కర్లు అన్ని పంట కాలువలు, మురుగు కాలువలు పరిశీలించి గుర్రపు డెక్క తొలగింపు అవసరం ఉన్న ప్రదేశాలు లను ఉపాధి హామీ కూలీలు ద్వారా తొలగించగలవి, జెసిబి ద్వారా తొలగించ వలసినవి గా రెండు జాబితాలు మే 31వ తేదీ లోపు అందించాలన్నారు. రామేశ్వరం మొగ పూడిక తీత కోసం ప్రాధమిక పరిశీలన చేయాలని ఆదేశించారు.అల్లవరంలోని బుడంపేట, బోడసకుర్రు లోని కొన్ని ప్రాంతాలు వరద సమయంలో చానల్స్ లో నీరు గోదావరిలోకి వెళ్ళక పోవడం వలన ముంపునకు గురవుతున్నందున ఈ సమస్య పై దృష్టి పెట్టాలని ఇరిగేషన్, డ్రెయిన్ల ఎఇలకు సూచించారు. ఖరీఫ్ సాగుకు రైతులను సమాయత్తం చేసేలా కార్యాచరణ ఉండాలని వ్యవసాయ అధికారికి సూచించారు ఈ సమావేశంలో ఎంపిడిఒ బి.కృష్ణ మోహన్, ఇరిగేషన్ ఎఇ రెహ్మాన్, డ్రయిన్ల ఎఇ సునీత, ఎఒ సత్యనారయణ, ఎంపిడిఒ కార్యాలయం ఎఒ లక్ష్మణ రావు , ఇఒఆర్డి సత్యనారయణ, కార్యదర్శులు, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.