ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
ఎన్నికల విధుల నుండి వికలాంగ ఉద్యోగస్తులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం వికలాంగుల మరియు వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.కామరాజుకు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల కమీషన్ ఉత్తర్వుల ప్రకారం వికలాంగ ఉద్యోగస్తులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఉందని ఈ ఉత్తర్వులను కాదని కొంత మంది వికలాంగ ఉద్యోగస్తులకు ఎన్నికల డ్యూటీలు వేస్తున్నారని పెనమలూరు, మచిలీపట్నం ఇలా అనేక ప్రాంతాల్లో వికలాంగులకు ఎన్నికల డ్యూటీలు వేసారన్నారు. దీని వలన వికలాంగ ఉద్యోగస్తులకు శారీరక, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం వికలాంగ ఉద్యోగస్తులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఎన్పిఆర్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జన్ను లక్ష్మణ్, ఎన్ఎస్ నారాయణ, సభ్యులు ఎం.నాగబాబు తదితరులు ఉన్నారు.