ప్రజాశక్తి-గన్నవరం: ఉపాధ్యాయ వృత్తికి దాసరి నవభారతి వన్నె తెచ్చారని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అన్నారు. గన్నవరం చింతలపేట ఎంపీపీ స్కూల్లో ఎల్ఎఫ్ఎల్హెచ్ గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన దాసరి నవభారతి అభినందన కార్యక్రమం సోమవారం హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో స్పందన మానసిక వికాస కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ మంచికి, మానవత్వానికి మారు పేరుగా నిలిచి, విద్యార్థులను ఎంతో అంకిత భావంతో నిబద్ధతతో భావి భారత పౌరులను తీర్చి దిద్దడంలో ఆమె ఎంతో కృషి చేశారని తెలిపారు. సమాజ అభివృద్ధికి ఎన్నో సేవాకార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తిలో 40 ఏళ్లు అంకితభావంతో పని చేసి జిల్లాస్థాయిలో ఉత్తమ టీచర్గా వివిధ సంస్థల నుండి అవార్డులు అందుకున్నారని తెలిపారు. గన్నవరం ప్రాంతంలో వికలాంగుల స్పందన మానసిక వికాస కేంద్రం ఏర్పాటు చేసి ఉచితంగా విద్యా వైద్య రవాణా భోజన సేవలు అందిస్తున్న హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్, సెక్రెటరీ సంకాబత్తుల రజిత వెంకట్లకు అభినందనలు తెలిపారు. దాసరి నవభారతి మాట్లాడుతూ తన 40 సంవత్సరాల ఉపాధ్యాయ సర్వీస్లో పిల్లలు మధ్యలో గడపడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ధిక నిపుణులు గన్నె వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘం వైస్ చైర్మన్ జి.జయబాబు, గన్నవరం చింతలపేట ఉపాధ్యాయురాలు డిఎన్యస్ కుమారి, ఐకాన్ ఎడ్యుకేషనల్ అకాడమీ డైరెక్టర్ వీరబత్తిన అమల్దాస్, వేమూరి వేణు, బండి కిషోర్ కుమార్, బావిశెట్టి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.